అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలతో.. | International Mother Language Day

ఈ చిత్రంలో ఉన్న ఆ నలుగురు బెంగాలీ యువకులు - 1952 ఫిబ్రవరి 21న ఢాకాలో మాతృభాష కోసం జరిగిన ఉద్యమంలో కాల్పులకు బలైయ్యారు. మాతృభాష కోసం ప్రాణాలర్పించిన ఆ రోజును ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక విభాగమైన యునెస్కో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా 1999 నవంబరు 17న ప్రకటించింది. ఆ బలిదానానికి గుర్తుగా ఢాకా విశ్వవిద్యాలయంలో నిర్మించిన ఙాపక చిహ్నం ఈ నాటికి చెక్కుచెదరలేదు. బహుభాషాతనాన్ని, భాషా-సాంస్కృతిక భిన్నత్వాన్ని గుర్తించేందుకు, అవగాహన పొందేందుకు ఈ రోజు ఎంతగానో దోహదపడుతుంది.  భాష ప్రతిష్టను గుర్తిస్తేనే మనుగడసాధ్యమని గుర్తించిన ఐక్య రాజ్య సమితి జనరల్ అసెంబ్లీ కూడా 2008ని అంతర్జాతీయ భాషా సంవత్సరంగా ప్రకటించింది.

మాతృభాషపై మమకారం పెంచుకున్న ఎందరో మహనీయులు మన తెలుగును కాపాడేందుకు అహర్నిశలూ శ్రమించారు. ఆంగ్లేయుల పాలనలో మన విద్యార్థులకు కొత్తభాష అవసరమైంది. శతాబ్దాలుగా పుస్తకాల్లో వాడే కట్టుదిట్టమైన భాషలో రాయాలని కొందరన్నారు. వాళ్లకు చిన్నయసూరి నాయకుడయ్యారు. ప్రజల భాషలో రాయడం ప్రపంచం అంతటా ఉన్న పద్ధతి. కాబట్టి మాట్లాడే భాషలోనే రాయాలని కొందరన్నారు. వాళ్లకు గిడుగు రామ్మూర్తి పంతులు నాయకుడయ్యారు. గిడుగు రామ్మూర్తి పంతులు కారణంగా 1906నుంచి వాడుక భాషలో రాయాలన్నది ఒక పెద్ద ఉద్యమమైంది. వాడుక భాష ప్రజల్లో బలంగా నాటుకుంటూ నూరేళ్లలో అత్యున్నతస్థాయికి చేరిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

గతంలో మనం మాట్లాడే తెలుగుభాషలోనే పరిపాలన సాగాలని, అందుకు ప్రత్యేక రాష్ట్రం అవసరమని 1913లో ఆంధ్ర మహాసభ తీర్మానించింది. ఉద్యమం ప్రారంభమైన 40 ఏళ్ల అనంతరం పొట్టి శ్రీరాములు బలిదానంతో 1953లో ఆంధ్రరాష్ట్రం ఆవిర్భవించింది. వావిలాల గోపాలకృష్ణయ్య తెలుగుభాషాభివృద్ధికి చేసిన పోరాటం తెలుగు ప్రజలు మరువలేనిది. దాని ఫలితంగా తెలుగును అధికార భాషగా గుర్తిస్తూ 1964లో చట్టం చేశారు. ఆగస్టు 29న - 'శిష్ట వ్యవహారిక' రూప శిల్పి గిడుగు రామమూర్తి జయంతిని తెలుగు -మాతృభాషా దినోత్సవంగా పాటిస్తున్నాం.

ఏ జాతైనా తమ భాష ప్రతిష్టను గుర్తించినప్పుడే ఆ భాష అభివృద్ధి చెంది, మనగలుగు తుంది. 2020 నాటికి చాలా భాషలు కనుమరుగవుతాయని యునెస్కో హెచ్చరిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడే 6000 భాషలలో 43% భాషలు, అంతరించిపోయే భాషల జాబితాలో చేరాయంటోంది. ఇది ఇలాగే కొనసాగితే మున్ముందు మిగిలే భాషలు 600 అని ఒక అంచనా… ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మాతృభాష కోసం ఉద్యమం ఉదృతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
 

No comments: