ఆ రోజుల్లో.. | Government Launches Biodegradable Sanitary Pads

అరుణాచలం మురుగనాథమ్ ఓ సామాజిక వేత్త. పదో తరగతి వరకే చదివినా తక్కువ ఖర్చుతో నాణ్యమైన శానిటరీ ప్యాడ్స్ తయారు చేసే యంత్రాన్ని ఆవిష్కరించాడు. ప్యాడ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందాడు. మహిళల రుతుక్రమంలో వినియోగించే శానిటరీ ప్యాడ్స్‌ ని అతి చౌకగా అందించేందుకు ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు. ఇదే కథాంశంగా బాలీవుడ్‌ హీరో అక్షయ్‌కుమార్‌ హీరోగా ‘ప్యాడ్‌ మ్యాన్‌’ సినిమా రూపొందింది. ఇక్కడి వరకు అందరికి తెలిసిందే!. నెలసరి సహజ ప్రక్రియ అని సిగ్గు పడాల్సిన అవసరమేమిలేదని 'ప్యాడ్‌మ్యాన్‌ చాలెంజ్‌' పేరిట సినీ, క్రీడా రంగ ప్రముఖులు జోరుగా ప్రచారం సాగించిన నేపథ్యంలో స్వచ్ఛంద సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమవంతు పాలుపంచుకుంటున్నాయి. బాలికలతోపాటు మహిళల మెరుగైన ఆరోగ్యం కోసం సబ్సిడీ ధరలకు శానిటరీ ప్యాడ్స్ అందించేలా కొత్త పథకాలను అమలులోకి తీసుకువచ్చాయి.

- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌లో శానిటరీ నాప్‌కిన్‌ల కోసం వంద కోట్ల రూపాయల బడ్జెట్‌ కేటాయించింది. మహిళలకు శానిటరీ నాప్‌కిన్‌లను ప్రభుత్వం సగం ధరకే ఇవ్వనుంది.
- మహారాష్ట్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ ‘అస్మిత’ పేరిట కేవలం ఐదు రూపాయలకు 8 ప్యాడ్స్‌ ఉన్న ప్యాక్‌ అందించేందుకు ఏర్పాట్లుచేసింది.
- పాఠశాలలోని విద్యార్థినులకు శానిటరీ ప్యాడ్‌లను ఉచితంగా అందించేందుకు ఢిల్లీ సర్కార్‌ నిర్ణయించింది.
- ముంబై నుంచి న్యూఢిల్లీ వెళ్లే రాజధాని ఎక్స్ ప్రెస్ రైలులో శానిటరీ ప్యాడ్స్ అందించే డిస్పెన్సింగ్ యంత్రాన్ని రైల్వేశాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది.
- సికిందరాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రారంభించిన ఈ సదుపాయం త్వరలో దేశంలోని 200 రైల్వేస్టేషన్లలో, అన్ని రైళ్లలోని మహిళా ప్రయాణికులకు ఐదురూపాయలకే శానిటరీ ప్యాడ్ అందించేందుకు చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు ప్రకటించారు.

శానిటరీ నేప్కిన్‌ వెండింగ్‌ మెషీన్‌లతో పాటుగా వాడేసిన శానిటరీ ప్యాడ్స్ వల్ల కాలుష్యం ఉత్పన్నం అవకుండా వీటిని పూర్తిగా నిర్వీర్యం చేయడానికి కూడా యంత్రాలను బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, కార్పొరేట్ ఆఫీసులు, స్కూళ్లు తదితర చోట్ల ఏర్పాటు చేయడం అవసరం అనే చర్చ కూడా మొదలయింది. 


No comments: